గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమం: ఎస్పీ

సంగారెడ్డి,జనవరి7(జనంసాక్షి): గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ.. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని తలా కనీసం మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్‌ ను ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.  సందర్భంగా ఆయన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ను స్వీకరించాల్సిందిగా ముగ్గురు పోలీస్‌ అధికారులను నామినేట్‌ చేశారు. వారిలో మెదక్‌ జిల్లా ఎస్పీ చందన దీప్తి, సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్‌ గౌడ్‌, డిటీసీ ప్రిన్సిపాల్‌ సీతారాం ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ హరిలాల్‌ గారు, ఆర్‌ఎస్‌ఐలు రాజశేఖర్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దుర్గా రెడ్డి, కోశాధికారి ఆసిఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.