గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌

నల్గొండ,జనవరి7(జనంసాక్షి):  మొక్కలు నాటి, ప్రకృతితో మమేకమవుదామని కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆయన మంగళవారం జిల్లాలోని అప్పాజీపేట గ్రామంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడం
సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో కొన్ని కోట్ల మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని కాదనీ.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలనే ఆలోచనతోనే ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కలెక్టర్‌ తెలియజేశారు. అందులో భాగంగానే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రోగ్రామ్‌ చేపట్టి అప్రతిహతంగా కొనసాగిస్తున్నారని కలెక్టర్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులే కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటి.. సంరక్షించేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నల్గొండ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రజలకు సూచించారు.