ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట, డబీర్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాలు, జాతీయ సైన్స్‌ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఈశ్వరమూర్తి, మంగ్యానాయక్‌ సూచించారు. స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొని తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ లద్ఘిర్మన్‌ మల్లయ్య పాల్గొన్నారు.దంతాలపల్లి జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని నరసింహులపేట మండలం దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించారు. ఉపన్యాస, క్విజ్‌, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.బుచ్చయ్య తెలిపారు. ఇదిలావుంటే మద్దూరు మండలంలోని అర్జున్‌పట్ల పాఠశాలలో నిర్వహించిన ఎంఈవో నాగిరెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పూల రవీందర్‌, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎంఈవో నాగిరెడ్డి సేవలను కొనియాడి దంపతులను సన్మానించారు.ఇక : గీసుకొండ మండలం రెడ్డిపాలెంలోని విద్యానిలయ ఉన్నత పాఠశాలలో 2015 ఎడ్యూ ఫేర్‌ను శనివారం నిర్వహించారు. 53 అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఈ.సుమాదేవి, పాఠశాల కరస్పాండెంట్‌ ఎన్‌. కవిత, శ్రీనివాసరెడ్డి, ప్రిన్పిపల్‌ జి.హరిత పాల్గొన్నారు.