చంద్రబాబుకు అద్దెమైకు పవన్‌

– పవన్‌ నాయుడు మాటలు నమ్మొద్దు
– మంత్రి అవంతి శ్రీనివాస్‌
విశాఖపట్నం, నవంబర్‌14 (జనం సాక్షి) : చంద్రబాబు నాయుడుకు అద్దెమైకులా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మారాడని మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాడు-నేడు కార్యక్రమంపై కొంతమంది బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పవన్‌ నాయుడు, చంద్రబాబు పవన్‌ మాటలు తల్లితండ్రులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని నమ్మొద్దన్నారు. పవన్‌ కల్యాణ్‌ తన సొంత అన్నయ్య చిరంజీవిని మరిచిపోయి, అద్దె అన్న చంద్రబాబును తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. జనవరి 9నుండి అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 2024 నాటికి ఏపీ అక్షరాస్యతలో ఏపీ నంబర్‌వన్‌కు రావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. అదేవిధంగా వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  చంద్రబాబు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు నమ్మరన్నారు. సీఎం జగన్‌పై పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని ద్రోణంరాజు హెచ్చరించారు.