చంద్రబాబు తీరుతో విస్తుపోయాను

నాయిబ్రాహ్మణులపై చంద్రబాబు తీరు సరికాదు
బీసీల పట్ల చంద్రబాబు కపటప్రేమ మరోసారి స్పష్టమైంది
వైసీపీ అధికారంలోకి వస్తే నాయిబ్రాహ్మణుల్లో చిరునవ్వులు పూయిస్తా
టీటీడీ బోర్డులో ఒక నాయిబ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తా
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌
రాజమహేంద్రవరం, జూన్‌19(జ‌నం సాక్షి ) : కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించడాన్ని  ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ట్విటర్‌లో తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తాను విస్తుపోయా అని…. మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరన్నారు. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబు హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయని జగన్‌ అన్నారు. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైందన్నారు. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారని, భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యమన్నారు. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ‘దేవుడి దయతో వైసీపీ ప్రభుత్వం రాగానే విూ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తానని, ఎప్పటికప్పుడు విూ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.