చంద్రబాబు, లోకేష్‌పై..  అవినీతి ఆరోపణల కేసు ఉపసంహరణ

– సరైన ఆధారాలతో రావాలని ఆదేశించిన హైకోర్టు
– రాజకీయాలుంటే బయట చూసుకోండి.. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు
– పిటిషనర్‌కు సూచించిన న్యాయస్థానం
– ఆధారాలు లేకపోవటంతో తన పిటీషన్‌ను వెనక్కు తీసుకున్న శ్రవణ్‌కుమార్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్‌ శ్రవణ్‌కుమార్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. శ్రవణ్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారు. ఈసందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ..  పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు సూచించారు. సరైన ఆధారాలు లేకుండా పిటీషన్‌ను స్వీకరించబోమని, ఆధారాలు లేకుండా పిటీషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఈ ఫిటీషన్‌ రాజకీయంగా వేసిన పిటీషన్‌లా ఉందని, రాజకీయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలని కోర్టు సమయాన్ని వృధాచేయవద్దని పిటీషనర్‌కు హైకోర్టు సూచించింది. దీంతో శ్రవణ్‌కుమార్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గత నాలుగేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ సంపాదించిన ఆస్తులపై దర్యాప్తు చేయించాలని హైకోర్టులో మంగళవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని మాజీ న్యాయాధికారి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు జె.శ్రవణ్‌ కుమార్‌ పిటిషన్‌ వేశారు. ఏపీలో ఐటీ అభివృద్ధి, కొత్త సంస్థల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు వేలాది ఎకరాలను ధారాదత్తం చేసిన చంద్రబాబు, లోకేష్‌ లు రూ. 25 వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారంటూ పిటిషన్‌ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా చంద్రబాబు, లోకేష్‌ లతో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఏపీఎన్నార్టీ సొసైటీ ఛైర్మన్‌ వేమూరి రవికుమార్‌ లను చేర్చారు. లోకేష్‌ ఐటీ మంత్రి అయిన తర్వాత తన సవిూప బంధువు రవికుమార్‌ ను ఐటీశాఖ ముఖ్య సలహాదారుడిగా, ఏపీఎన్నార్టీ ఛైర్మన్‌ గా నియమించారని పిటిషన్‌ లో ఆరోపించారు. కంపెనీల నుంచి క్విడ్‌ ప్రోకో ద్వారా ప్రయోజనాలను పొందేందుకు రవికుమార్‌ ను చంద్రబాబు, లోకేష్‌ లు ఉపయోగించుకుంటున్నారని పిటిషనర్‌ తెలిపారు. వివిధ కంపెనీలకు కేటాయించిన 57,836 ఎకరాల భూముల్లో జరిగిన కొన్ని అక్రమాలను పిటిషన్‌ లో వెల్లడించారు. ఇన్నోవా సొల్యూషన్స్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థలకు విశాఖలో సుమారు రూ. 500 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకే కేటాయించారని ఆరోపించారు. కాగా బుధవారం హైకోర్టుకు సరైన సాక్ష్యాదాలు అందించక పోవటంతో కోర్టులను ఆధారాలతో రావాలని పిటీషనర్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆధారాలు లేకపోవటంతో శ్రవణ్‌ కేసును ఉపసంహరించుకున్నాడు.