చలో ఢిల్లీ సక్సెస్‌

– రైతులపై విరుచుకుపడ్డ పోలీసు బలగాలు

– వాటర్‌ క్యానన్‌ల ప్రయోగం

చండీగఢ్‌,నవంబరు 26(జనంసాక్షి):నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కరోనా నేపథ్యంలో రైతుల ఆందోళనకు దిల్లీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. దీంతో దిల్లీ సరిహద్దుల్లో హరియాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా హైవే వద్ద రైతులను బలగాలు నిలువరించాయి. దీంతో ఆగ్రహించిన రైతులు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళన నేపథ్యంలో హరియాణా నుంచి దిల్లీ వచ్చే మార్గాల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. దిల్లీలోకి రైతులు రాకుండా సోనిపట్‌ వద్ద సరిహద్దులను మూసేసి సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రోహ్‌తక్‌-ఝజ్జర్‌ సరిహద్దుల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.

కేజ్రీవాల్‌ విమర్శలు..

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. ‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు ప్రయోగిస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేయడం రాజ్యాంగ హక్కు. రైతులపై జలఫిరంగులు ప్రయోగించడం కచ్చితంగా తప్పే’ అని కేజ్రీవాల్‌ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

రైతుల ఆందోళన: దిల్లీ సరిహద్దుల మూసివేత

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల ఉద్యమిస్తున్న లక్షలాది మంది రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. ‘చలో దిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చిన రైతులు గురువారం జంతర్‌మంతర్‌ వద్ద భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు నిలువరించేందుకు రాజధాని సరిహద్దులను మూసివేశారు. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌లోని సరిహద్దుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ దృష్ట్యా దిల్లీలో ఎలాంటి ర్యాలీలను ప్రభుత్వం అనుమతించలేదు. అటు దిల్లీ మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో 26, 27 తేదీల్లో ఆందోళన చేపట్టేందుకు యూపీ, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పంజాబ్‌ రైతులు ‘చలో దిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు. అయితే, కరోనా దృష్ట్యా వీరి ర్యాలీకి దిల్లీ పోలీసులు తిరస్కరించారు. అయినప్పటికీ రైతులు దిల్లీ దిశగా బయల్దేరడంతో పోలీసులు సరిహద్దులు మూసివేశారు. దిల్లీ-జమ్మూ హైవేపై కూడా పోలీసులు భారీగా మోహరించారు