చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు..

– అజ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం..
– సీబీఐ, ఈడీ అధికారుల వెతుకులాట
న్యూఢిల్లీ, ఆగస్టు21 (జనంసాక్షి) :  ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి. చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు.. చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో చిదంబరం విదేశాలకు వెళ్లకుండా ఈడీ చర్యలు తీసుకుంది.
చిదంబరానికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో.. ఆయన కనిపిస్తే అదుపులోకి
తీసుకోవాలని సీబీఐ, ఈడీ అధికారులు ఎదురుచూస్తున్నారు. అయితే చిదంబరం అజ్ఞాతంలోనే ఉండిపోయారు.
ఇక మరోవైపు  బుధవారం ఉదయం చిదంబరం నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లి వచ్చినప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు. చిదంబరం తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. చిదంబరం పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ప్రస్తావించారు. చిదంబరం పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనానికి ఎన్వీ రమణ ధర్మాసనం పంపింది. కపిల్‌ సిబాల్‌ వాదనల తర్వాత సీజేఐ ధర్మాసనానికి ఎన్వీ రమణ పంపారు. వాదనలను సీజేఐ ముందు వినిపించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం సూచించింది.
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సీజేఐ ముందు ప్రస్తావనకు రానుంది చిదంబరం పిటిషన్‌.
బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం :రాహుల్‌ గాంధీ
చిదంబరం కోసం సీబీఐ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరం వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు మోదీ ప్రభుత్వం  సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నెముకలేని విూడియాను వాడుకుంటోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.