చిన్నారుల్లో న్యుమోనియా నియంత్రణకు వ్యాక్సిన్‌


జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ
మెదక్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): చిన్నపిల్లలకు సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన న్యూమోనియాను నియంత్రించే పీసీవీ (న్యూమోకొకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌) టీకా మెదక్‌ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులోకి రానున్నది. టీకా వేసే పక్రియను జిల్లావ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రైవేట్‌ కేంద్రాల్లోనే ఈ వ్యాక్సిన్‌ ఇస్తుండగా తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా పీసీవీ వేస్తున్నామని, జిల్లాకు 1750 డోసులు వ్యాక్సిన్‌ వచ్చిందని తెలిపారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్టాల్రకు పైలట్‌ ప్రాజెక్టుగా ఈ టీకాను కేంద్రం ఉచితంగా అందజేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో, తొలుత మెదక్‌ జిల్లాలో అమలు చేసి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తేవాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. చిన్నారుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌ వంటి వ్యాధులు వ్యాపించకుండా ఈ వ్యాక్సిన్‌ కట్టడి చేస్తుందని డీఎంహెచ్‌వో తెలిపారు.
చిన్నారుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా కట్టడి చేసే ఈ టీకాను ఇచ్చేందుకు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో ఆరు వారాల్లోపు వయసున్న శిశువులకు వ్యాక్సిన్‌ వేస్తారు.