చెరువులకు మళ్లీ జలకళ వచ్చేనా

వర్షాభావంతో రైతుల్లో ఆందోళన
ఖమ్మం,జూలై22(జ‌నంసాక్షి): రెండేల్ల క్రితం ఎస్సారెస్పీకి వచ్చిన నీటిని కాల్వల ద్వారా ఖమ్మం వరకు పారించి రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నీ నింపింది. అలాగే ఎల్లంపల్లి ద్వారా సాధ్యమైనంత మేర నీటిని చెరువుల్లోకి మళ్ళించగలిగింది. తద్వారా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద 2400 చెరువులు నింపినట్లు అధికారవర్గాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తిరిగి వర్షాభావం కారణంగా మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. ఈ యేడు పరిస్థితులు ప్రతికూలంగ ఆమారడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లా కరువు పీడిత రైతులకు వరంగా మారింది. ఇక్కడి రైతులు గతంలో ఆరుతడి పంటలు మాత్రమే పండించేవారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో వరి పంటను సాగు చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నా నీరు లేక డీలా పడ్డారు. గతంలో పాలేరు జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రావిూణం, నేలకొండపల్లి, ముదిగొండ, మహబూబాబాద్‌ ప్రాంతంలోని 54 చెరువుల్లో నీటిని నింపగా 34 చెరువులు అలుగులు పారాయి. ఈ ఆయకట్టు కింద ఉన్న 58,998 ఎకరాల పంటభూమి సాగులోకి వచ్చిదంటే ప్రభుత్వం చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. దీంతో కందుల దిగుబడి భారీగా పెరిగింది. సుమారు 4.36 లక్షల హెక్టార్లల్లో కంది సాగయింది. దీని ద్వారా బహిరంగ మార్కెట్లలో ధరలు తగ్గి తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని గ్రహించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నది. రైతులకు గతంలో సరిపడా గోదాములు అందుబాటులో ఉండేవి కావు. పంటను నిల్వ చేసేందుకు దళారులపై ఆధారపడేవారు. గతంలో 176 గోదాములు మాత్రమే ఉండేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం  17.07 లక్షల మెట్రిక్‌ టన్నులు నిల్వచేసే సామర్థ్యం గల 330 కొత్త గోదాములు నిర్మిస్తున్నది. ప్రస్తుతం 285 గోదాముల నిర్మాణం పూర్తికాగా 32 గోదాములు త్వరలో పూర్తికానున్నాయి. మరో 13
గోదాముల నిర్మాణం కోసం శ్రమిస్తున్నది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి  నిరంతర  విద్యుత్‌ సరఫరా చేయడం వల్ల  విద్యుత్‌ డిమాండ్‌ అత్యంత గరిష్ఠంగా నమోదైంది.  ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన ఏ ఒక్క కరెంటు మోటార్‌ కూడా కాలిపోలేదంటే ప్రభుత్వం ఎంతటి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు అందనున్నాయనుకుంటున్న తరుణంలో మళ్లీ వర్షాభావం కుంగదీస్తోందని రైతాంగం ఆందోళన చెందుతోంది. మళ్లీ వర్షాలు పడితేనే చెరువులు కుంటల్లోకి నీరు చేరనుంది.