జగన్‌ పాలనతీరు అధ్వాన్నం: డిఎల్‌

కడప,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : ఏపీలో ప్రతి పథకానికి వైఎస్సార్‌ పేరును పెట్టి ప్రజల నెత్తిన టోపి పెడుతున్నారని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి వైఎస్‌ జగన్‌ పాలనతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు నిర్వీర్యం అయ్యాయని, వైఎస్‌ పేరును చెడగొడుతున్నారని ఆరోపించారు. కొంతమందికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అభయహస్తం, విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు పనికిరాకుండా పోతున్నాయని విమర్శించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, భారీ వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రవీంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.