జమ్మూలో ఘోర బస్సు ప్రమాదం

– లోయలో పడిన మినీ బస్సు
– 13మంది మృతి, మరో 13మందికి తీవ్ర గాయాలు
శ్రీనగర్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన మినీ బస్సు ఒకటి  లోయలోకి పడిపోయింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు రాజిందర్‌ గుప్తా అందించిన సమాచారం  ప్రకారం..  కాశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చీనాబ్‌ నది సవిూపంలో 300 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. బస్సులో మొత్తం  30మంది ప్రయాణికులున్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్త్వార్‌ డిప్యూటీ కమిషనర్‌ అంగ్రేజ్‌ సింగ్‌ రాణా ప్రకటించారు.  అలాగే ఈ ప్రమాంలో చనిపోయినవారికి 5లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల పరిహారాన్నిప్రకటించారు. అటు ఈ ఘోర ప్రమాదంపై పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిషనర్‌ ఎస్పీ వాయిద్‌ ట్విటర్‌లో సంతాపం
తెలిపారు.