జాతీయ అవార్డు గ్రహీతను ముద్దాడిన జన్మభూమి

ఫోటోగ్రాఫర్‌ స్వామిని ఘనంగా సత్కరించిన స్వగ్రామం

కరీంనగర్‌,నవంబర్‌ 6(జ‌నంసాక్షి): ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదుగుతున్న ఫోటోగ్రాఫర్‌ జాతీయ

స్థాయిలో అవార్డు సొంతం చేసుకోవడంతొ ఆయనను కన్న జన్మభూమి పొంగిపోయింది. వృత్తి ఏదైనా సాదించిన బహుమతి అత్యద్బుతమైనది కావడంతో ఆగ్రామం గ్రామం అతా ఒక్కటై జాతీయ అవార్డు సొంతం చేసుకున్న గుంటపల్లి స్వామిని ఘనంగా సత్కరించింది. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన గుంటపల్లి స్వామి ఫోటో గ్రాఫర్‌గా వృత్తిని చేపట్టాడు ఆతర్వాత 1991లో ప్రారంభమైన వార్త దినపత్రికలో ఫోటోగ్రాఫర్‌గా జీవితాన్ని మార్చుకున్న ఆయన ఇప్పటివరకు పత్రికా ఫోటో జర్నలిస్ట్‌గా అనేక అద్బుతమైన ఫోటోలను చిత్రీకరించి వేలాదిమందిని ఔరా అనిపించాడు. వార్త నుంచి ఆంద్రజ్యోతి ఆతర్వాత సాక్షి ప్రారంభం కాగానే అందులో చేరిన గుంటపల్లి స్వామి అందులో కొనసాగు తున్నాడు. ఇటీవల ఫోటో గ్రాఫీలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించగా అందులో స్వామి ఎంపికయ్యారు. ఇతడికి విజయవాడలో పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమంలో అక్కడి ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ వాసుదేవ దీక్షితులు పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటొను ఇచ్చి నగదు బహుమతిచ్చారు. ఆతర్వాత సొంత జిల్లాకు వచ్చిన స్వామిని వివిద సంస్థలు, పార్టీలు ఎవరికి తోచిన రీతిలో వారు సత్కరిస్తూనే ఉన్నారు. అయితే ఇది గమనించిన ఆయన స్వగ్రామస్థులు అంతా ఏకమై జన్మభూమినుంచి ఎందుకు సత్కరించుకోవద్దని భావించి ఊరుఊరంతా ఏకమై ప్రజాప్రతినిధులు సమావేశమై ప్రత్యేకంగా సత్కరించి చంద్రునికో నూలు పోగులాగా గౌరవించుకున్నారు. ఎక్కడున్నా కూ స్వామి మల్కాపూర్‌ వాసిగానే చరిత్రలో నిలిచిపోతాడని, ఆయనకు అవార్డు రావడం అంటే తమ గ్రామానికి అవార్డు వచ్చినట్లుగానే భావిస్తున్నామని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అభినందనల వర్షం గుప్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపిటిసి ఈశ్వర్‌, ఉషోదయ యూత్‌ క్లబ్‌ అద్యక్షుడు కిషోర్‌ తోపాటు గ్రామస్థులు ఆయన బాల్యమిత్రులు ఈ సత్కారం చేసిన వారిలో ఉన్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కేక్‌కట్‌ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ చేసుకున్నారని చెప్పవచ్చు.