జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి
జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సర్వే
ప్రారంభించింది. హెల్త్‌ప్రొఫైల్‌ ద్వారా ఎంత మందికి ఎలాంటి రోగాలు ఉన్నాయి.. ఎవరికి చికిత్సలు అవసరం, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారనే విషయాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. సర్వే అనంతరం ఇంటింటికి తిరుగుతూ కుటుంబంలో ఉన్న వారందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తామని అన్నారు.  ఆ తర్వాత వారికి అవసరమైతే శస్త్రచిక్సితల కోసం కార్పొరేట్‌ వైద్యం అందిస్తాం. జిల్లావ్యాప్తంగా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. వివరాలను ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తి కాగానే వివరాలను ఉన్నతస్థాయి అధికారులకు నివేదిక రూపంలో అందిస్తామని పేర్కొన్నారు.  ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 32.5 శాతం సర్వే పూర్తయిందన్నారు.  ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రభుత్వం వద్ద ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఇంటింటి సర్వేకు ఆదేశించారు.  ఈ మేరకు వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగా బాధితులకు వైద్యంతోపాటు అవసరమైన వారికి శస్త్రచిక్సితలు చేయనున్నారు. ప్రజలకు రోగ నిర్దారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే అధికారులు సర్వేలో నిమగ్న మయ్యారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతానికి చేరుకుంది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారి శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేకు శ్రీకారం చుట్టింది.గ్రావిూణ ప్రాంతాల్లో ప్రజలకు మైరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుగా వ్యాధి లక్షణాలను బట్టి పరీక్షలు చేస్తారు. అనంతరం ఉచిత వైద్యం, మందులు అందించనున్నారు. ఈ వేసవిలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రోగనిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నారు. రక్తపోటు, మధుమేహం, కొవ్వు, హిమోగ్లోబిన్‌, కాలేయ, మూత్రపిండాలు, దంత వ్యాధులను గుర్తించి తగిన వైద్యం అందించనున్నారు. ఆర్‌బీఎస్‌కే, 104 వాహన సేవలను ఇందుకు ఉపయోగించనున్నారు. గ్రామాల నుంచి రెఫరల్‌ దవాఖాన వరకూ కంప్యూటర్‌లోని సాప్ట్‌వేర్‌లో పర్యవేక్షణ ఉంటుంది. గ్రామాల నుంచి రెఫరల్‌ దవాఖానల వరకు వైద్య సేవలు వచ్చే ఏప్రిల్‌ నెలాఖరులో పూర్తి చేయాలని హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం.