జిల్లా ఏర్పాటు హావిూని నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్‌

అండగా నిలచి అన్ని ఎన్నికల్లో విజయం సాధించిపెట్టాలి
ములుగు,జనవరి3(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు జిల్లా కల ఫలిస్తోందని,జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ప్రహ్‌ఆద్‌ అన్నారు. కెసిఆర్‌ ఇచ్చిన మాట నిలుబెట్టుకునే నాయకుడని అన్నారు.  ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ఇచ్చిన హావిూని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ములుగు జిల్లా కోసం అవసరమైన నివేదికను తెప్పించుకుంది. తొమ్మిది మండలాలతో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఆరంభపు ప్రకటన విడుదల చేయాలి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవ్వాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రజల సమాచార నిమిత్తం ఆయా ప్రాంతాల్లో విస్త్రత ప్రచారం చేయాలని సూచించారు. ములుగు, వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో జిల్లా ఏర్పాటు ప్రకటన ఇవ్వనున్నారు. నిర్దేశించిన జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలాల నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో జిల్లా కలెక్టరుకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన రోజు నుంచి నెలలోపు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.మాట నిలబెట్టుకున్న కెసిఆర్‌కు అన్ని ఎన్నికల్లో విజయం అందించి అండగా నిలవాలని ప్రహ్లాద్‌ అన్నారు. గ్రామపంచాయతీల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లుగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారురాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు పొందిన కారణంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టారని అన్నారు.