జీఎస్టీ బకాయిలు చెల్లించండి

– పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రాంతీయ పార్టీలతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, ఆప్‌, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన పార్టీలకు చెందిన 70 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.9వేల కోట్ల జీఎస్టీ బకాయులు విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. జీఎస్టీ పరిహారం చెల్లించాలని ఎంపీలు నినాదాలు చేశారు. జీఎస్టీ బకాయిలపై పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేశామని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత కే. కేశవరావు తెలిపారు. బీజేపీయేతర రాష్ట్రాల ఎంపీలు కూడా ఆందోళనలో పాల్గొన్నారని కేకే చెప్పారు. కేంద్రం వెంటనే జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు కరోనా కాలంలో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి. కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాల్సింది పోయి కనీసం ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని అన్నారు. జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలపై 9 ప్రాంతీయ పార్టీల సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు నేడు పార్లమెంట్‌ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ… రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ధర్నా చేసినట్లు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 9 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు కేంద్రం వెంటనే చెల్లించాలన్నారు. బకాయిల చెల్లింపుపై వాయిదా తీర్మానం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యల ప్రస్తావనకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామన్న ఎంపీ బకాయిల చెల్లింపుపై పార్లమెంటులో చర్చ కోసం పట్టుబడనున్నట్లు పేర్కొన్నారు.