జీవిత బీమాతో రైతుకు భరోసా

సీఎం మానసపుత్రిక ‘రైతుబీమా’
గుంట భూమి ఉన్న వారికి పథకం వర్తిస్తుంది
దేశానికి తెలంగాణ రైతును ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ లక్ష్యం
రైతుబంధుతో పెట్టుబడి ఇబ్బందులు తప్పాయి
గతంలో ఈవిధంగా రైతుల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు
పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌లో రైతుబంధు ా జీవిత బీమాపై అవగాహన సదస్సు
పాల్గొన్న గుత్తా, మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌, జూన్‌20(జ‌నం సాక్షి ) : రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకే రైతుబీమా పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లు, రైతుబీమా పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అని ఈ పథకంతో రైతుల్లో భరోసా నింపుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సవిూపంలోని అన్నంపల్లి వైట్‌హౌజ్‌ కన్వర్షన్‌ హాల్‌లో ‘రైతుబంధు-రైతుబీమా’ పై అవగాహన సదస్సు జరిగింది. ఈసదస్సులో రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈసందర్భంగా పోచారం  శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 52 లక్షల 40 వేల మంది రైతులు ఉన్నారన్నారు. వారి వద్ద కోటి 40 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. రైతాంగానికి, వ్యవసాయానికి సాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. అందుకే రైతుల బీమా పథకాన్ని దేశంలో మొట్టమొదటి సారిగా కేసీఆర్‌ రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. 86 ఏండ్ల క్రితం భూసర్వే నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడే మొదటి సారిగా భూసర్వే నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రుణాల మాఫీ, 24 గంటలు విద్యుత్‌, సాగు నీరు, రైతు బంధు, పంటల పెట్టుబడులు, వేచి చూడాల్సిన అవసరం లేకుండా విత్తనాలు, ఎరువులను రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.5,730 కోట్లు ప్రీమియం కింద కడుతున్నదన్నారు. అవి రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి పథకాలను ఎలా రూపొందిస్తున్నారు? ఎలా అమలు చేస్తున్నారని ఆసక్తిగా సీఎంను అడిగినట్లు మంత్రి తెలిపారు. ఇలా అనేక రాష్ట్రాలు మన రాష్ట్ర ప్రభుత్వ పథకాల విూద ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నాయన్నారు. రైతు బీమా పథకం కింద ప్రతి రైతుకు రూ. 5 లక్షలు, గాయపడితే రూ. 2 లక్షలు అందిస్తామన్నారు. రూ. 50 ప్రీమియంతో ఇన్సూరెన్స్‌ పాలసీలున్నాయి.. కాని సీఎం కేసీఆర్‌ రైతుల విూద ఆప్యాయతతో రూ.2,271 ప్రీమియాన్ని ప్రతి రైతుకు చెల్లించడానికి ముందుకు వచ్చారన్నారు. జూన్‌ 30 లోగా వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి రైతు వద్దకు వెళ్లి రైతులు, నామినీ వివరాలు సేకరిస్తారన్నారు. జులై 15లోగా డాటా ఎంట్రీ పూర్తి చేస్తారన్నారు. ఆగస్టు 1 నుంచి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రీమియం చెల్లింపు జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరిగి రైతులకు స్వయంగా బీమా బాండ్లను అందజేస్తారన్నారు. జీవో 63 లో రైతు బీమా పథకానికి సంబంధించిన గైడ్‌ లైన్స్‌ ఉన్నాయన్నారు.
ఎవరూ రైతు గురించి ఆలోచించలేదు ా ఎంపీ గుత్తా
రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే నామినీల పేర్లు నమోదు చేయడం ప్రారంభమైందని, ఈనెల 30లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నడూలేని విధంగా
పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని, పక్క రాష్ట్రాల్లో సరైన మద్దతు ధర లేక మన కాడికి వచ్చి అమ్ముకుంటున్నారని తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతు..
పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మూడు ఏండ్లలో పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రైతాంగం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరువును పారదోలి.. కూలీ పనుల కోసం దేశమంతా తిరిగిన రైతులు ఇప్పుడు తిరిగి పాలమూరుకు వస్తున్నారన్నారు. కేసీఆర్‌ రైతాంగం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆయా పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇంతకుముందున్న సీఎంలకు, కేసీఆర్‌కు, గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. దురదృష్టవశాత్తు ప్రాజెక్టులను, అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉద్యమ స్థాయిలో ఉద్ధృతంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ….
వ్యవసాయం దండుగ అన్న పరిస్థితిని పూర్తిగా మార్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్‌ పండుగ చేశారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రైతే రాజన్న నానుడిని నిజం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతాంగం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. 24 గంటల పాటు విద్యుత్‌ని ఇస్తున్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టుల పనులు చేపట్టారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి శాశ్వతంగా కరువును పారదోలి.. సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మంత్రి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా పంటల పెట్టుబడులు, ఇప్పుడు బీమా పథకాన్ని పూర్తిగా ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కొరత తీర్చారు. నకిలీ విత్తనాలు లేకుండా చేశారు. రైతుల ఆత్మహత్యలను అదుపు చేశారు. రైతుల కోసం ఇంతగా చేసిన ప్రభుత్వాలు చరిత్రలో లేవు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయి. దేశం దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ పథకాల విూద పడింది. కర్ణాటక రాష్ట్ర సీఎం కుమారస్వామి సైతం తెలంగాణ పథకాలే తమకు ఆదర్శమన్నారు. రైతు బీమా పథకంపై రైతాంగానికి ఉద్దేశాలు, లక్ష్యాలు, లాబాలు, అమలు తీరుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితిలు, వ్యవసాయ విస్తరణాధికారులదేనన్నారు. వీళ్లంతా సమిష్టిగా పని చేసి రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.