జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
– బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని భేటీ
హైదరాబాద్, మే16(జనం సాక్షి) : జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. బత్తిని కుటుంబ సభ్యులతో మంత్రి తలసాని శ్రీనివాస్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ యోగితారాణా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. సమావేశం సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సవిూక్ష చేపట్టారు. అనంతరం మంత్రి స్పందిస్తూ.. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బత్తిని హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ.. జూన్ 8, 9వ తేదీల్లో చేప ప్రసాదం పంపిణీని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతదన్నారు. రెండు రోజుల తర్వాత పాతబస్తీలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.