జెఎన్‌యూ దాడి మాపనే: హిందూ రక్షాదళ్‌

న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి): జెఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షాదళ్‌ ప్రకటించింది.  ముసుగులు వేసుకుని వచ్చి విద్యార్థులపై ఢిల్లీలోని జేఎన్‌యూలో దాడి చేసింది తమ వర్కర్లే అని హిందూ రక్షా దళ్‌కు చెందిన పింకీ చౌదరీ తెలిపారు. వర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలను సహించ బోమన్నారు. జేఎన్‌యూలో జరిగిన దాడికి తాము పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. అయితే హిందూ రక్షాదళ్‌ చీఫ్‌ చేసిన కామెంట్లపై దర్యాప్తు చేపడుతున్నామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ఆరా తీస్తున్నారు. జేఎన్‌యూలోకి మాస్క్‌లు వేసుకుని వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీడియో ఫూటేజ్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నిక్‌తో వారిని పట్టుకునే ప్రయత్నం జరుగుతున్నది.