జేసీ దివాకర్‌రెడ్డికి మరోషాక్‌

– జేసీ ట్రావెల్స్‌ బస్సులపై అధికారుల దాడులు
– పత్రాలు లేని ఆరు బస్సులు సీజ్‌
– రెండు దఫాలుగా 30 బస్సులను సీజ్‌ చేసిన అధికారులు
అమరావతి, నవంబర్‌14 (జనం సాక్షి) : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డికి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. రవాణాశాఖ అధికారులు దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులపై సోదాలు మళ్లీ జరిపారు. గురువారం జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఆరు జేసీ ట్రావెల్స్‌ బస్సులు దొరికాయి. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో అధికారులు బస్సుల్ని సీజ్‌ చేశారు. గత నెల వ్యవధిలో ఆర్టీఏ అధికారులు రెండుసార్లు దాదాపు 30కిపైగా బస్సుల్ని సీజ్‌ చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించి.. ఇంటర్‌ స్టేట్‌ స్టేజ్‌ క్యారియర్‌ పర్మిట్లలో అక్రమాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య 36 బస్సులు.. 18 కాంట్రాక్టు బస్సులను సీజ్‌ చేశారు.. కొన్ని కేసులు కూడా నమోదు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులకు కొన్ని ఫిర్యాదులు కూడా అందాయట. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పాటూ టికెట్‌ ధరలు కూడా ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతర్రాష్ట స్టేజ్‌ క్యారియర్‌ బస్సుల పర్మిట్లను కూడా సస్పెండ్‌ చేశారు. కొద్ది రోజుల క్రితమే దివాకర్‌రెడ్డి జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. కొందరు నేతల్ని సీఎం టార్గెట్‌ చేసుకున్నారని.. దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 80బస్సులు సీజ్‌ చేశారు. 74ఏళ్ల ట్రాన్స్‌పోర్ట్‌లో తనకు అనుభవం ఉందని.. ఒక్క దివాకర్‌ ట్రావెల్సే నిబంధనలు అతిక్రమించిందా అంటూ ప్రశ్నించారు. మిగిలిన వాళ్ల బస్సులు ఎన్ని సీజ్‌ చేశారు.. ట్రిబ్యునల్‌ బస్సులను వదిలిపెట్టమని చెప్పినా ఆర్టీవో అధికారులు విడిచిపెట్టడం లేదన్నారు. తమను పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. తాము పార్టీలో చేరితే కేసులుండవని చెబుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేసిన వారానికే మళ్లీ బస్సులు సీజ్‌ అయ్యాయి.