టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన చిరువ్యాపారులు

వారిని దోచుకున్న ఘనులు కాంగ్రెస్‌ నేతలన్న మంత్రి

సూర్యాపేట,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులను దోచుకున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించడం జరిగిందని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ సమక్షంలో సూర్యాపేటకు చెందిన చిరు వ్యాపారులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే తమకు రక్షణ దొరికిందని.. కారు గెలుపు కోసం శ్రమిస్తామని చిరు వ్యాపారులు స్పష్టం చేశారు. నాలుగున్నరేండ్లలో ప్రశాంతంగా వ్యాపారం చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు తమను దోచుకున్నారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిరు వ్యాపారులు దోపిడీకి గురయ్యారు. గుండాగిరితో వ్యాపారులను దోచుకున్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నారు. ఈ భవిష్యత్‌లోనూ చిరు వ్యాపారులకు ఈ తరహాలోనే స్వేచ్ఛ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ఏకైక ఎజెండాగా కేసీఆర్‌ మ్యానిఫెస్టోను రూపొందించారని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల పెంపుతో అన్ని వర్గాల వారికి మేలు కలుగుతుందన్నారు. అధికారంకోసం కాంగ్రెస్‌ పార్టీ అనైతిక పొత్తులతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తుందని, ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.