టిక్కెట్పై ధీమాగా ఉన్న సుంకె రవిశంకర్
పెద్దపల్లి,నవంబర్14(జనంసాక్షి): బోడిగె శోభకు టిఆర్ఎస్ నుంచి టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో పాటు, తనకే టిక్కెట్ ఖాయమన్న ధీమాలో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ ఉన్నారు. దీంతో ఆయన చొప్పదండి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమనీ, చొప్పదండి నియోజకవర్గంలో సైతం గులాబీ జండాను ఎగరేస్తామని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించి ఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామనిసుంకె రవిశంకర్ అన్నారు. గ్రామాల్లో ఆయన ప్రతిరోపజూ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో గడపగడపకూ తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాయా? లేదా? అని అడుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. కరువుతో కుదేలయిన చొప్పదండి నియోజకవర్గానికి గోదావరి జలాలను తెప్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వ్యవసాయం అంటే దండుగ అని గత పాలకులు అన్న చోటే 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమాతో ఆదుకున్న ఘనత టిఆర్ఎస్దన్నారు. వెయ్యి రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తూ వృద్ధు ల జీవితాలకు ఆసరాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని పేర్కొన్నారు. వర్షాకాలంలో సైతం సాగు నీరు అందక పంట పొలాలు సైతం బీడు భూములుగా మారితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎల్లంపల్లి జలాలతో నారాయణపూర్ రిజర్వాయర్ను, చెరువులను నింపి ఎండాకాలంలో సైతం చెరువులను మత్తడి దుంకించి రెండు పంటలకు సాగు నీరు అందించి భీడు భూములను సాగులోకి తీసుకు వచ్చారని అన్నారు.