టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!


– పార్టీకి గుడ్‌బై చెప్పిన తాజామాజీ ఎమ్మెల్యే సంజీవరావు
వికారాబాద్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు కూడా అవ్వకముందే టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. వికారాబాద్‌ జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. టికెట్‌ విషయంలో మంత్రి మహేందర్‌రెడ్డి తనకు నమ్మక ద్రోహం చేశారని, ఆ అవమానాన్ని భరించలేకే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశానని సంజీవరావు తెలిపారు. తన నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్‌కు మద్దతిస్తున్నట్లు ఆయన చెప్పారు. వికారాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన సంజీవరావును కాదని మెతుకు ఆనంద్‌కు టీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌
కేటాయించిన విషయం తెలిసిందే. 2014లో వికారాబాద్‌ నియోజక వర్గం నుంచి సంజీవరావు గెలిచారు. ఈయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ వికారాబాద్‌లో సర్వే చేశారు. అక్కడ సంజీవరావుకు వ్యతిరేకత ఉన్నట్లు గమనించిన కేసీఆర్‌.. అభ్యర్థిని మార్చారు. దీంతో మనస్తాపం చెందిన సంజీవరావు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు.