టీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదు

– టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌

హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను టీఆర్‌ఎస్‌ను వీడనని అన్నారు. సీతారాం నాయక్‌ పార్టీ మారుతున్నారని వార్తలు రావడంపై ఆయన స్పందించారు. దీంతో గురువారం తెలంగాణ భవన్‌లో సీతారాం నాయక్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్టీ మారుతున్నారని రేవంత్‌ చెప్పడం.. పేపర్లలో రావడం.. ఓ మైండ్‌గేమ్‌లా ఉందని ఎంపీ పేర్కొన్నారు. రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే పార్టీ మారుతున్న ఆ ఇద్దరు ఎంపీలేవరో చెప్పాలని సీతారాం నాయక్‌ డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి దుర్మార్గపు పనులు చేస్తున్నారవి, ఆయన ఎదుగుదలకు పని చేయవు అని చెప్పారు. రేవంత్‌ ప్రవర్తన అందరికీ తెలుసన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతోనే తాను మహబూబాబాద్‌ ఎంపీగా గెలిచానని సీతారాం నాయక్‌ స్పష్టం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు.