టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా..  కేటీఆర్‌ బాధ్యతల స్వీకరణ


– తెలంగాణ భవన్‌కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
– పార్టీని అజేయ శక్తిగా మలుస్తా
– టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– కార్యక్రమంలో పాల్గొన్న హరీష్‌రావు, తుమ్మల ఇతర నేతలు
హైదరాబాద్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం తెలంగాణ భవన్‌లో సోమవారం ఉదయం 11:56 నిమిషాలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బసవతారం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్‌ వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
దాదాపు 20వేలకుపైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్‌ వద్దకు తరలివచ్చారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ ఆటలతో టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది.
పార్టీని అజేయ శక్తిగా మలుస్తా – కేటీఆర్‌
విూ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్‌ నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో విూ ఆశీర్వాదం కోరుకుంటున్నాను, భగవంతుడు నాకిచ్చిన శక్తిని విూకోసం వినియోగిస్తానని టీఆర్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారని, కుల, మతాలకు అతీతంగా టీఆర్‌ఎస్‌ ను ఆశీర్వదించారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని, టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మల్చడానికి పెద్దలు కేసీఆర్‌ నాకు ముఖ్యమైన బాధ్యత అప్పజెప్పారన్నారు. నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. పార్టీని అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో విూ ఆశీర్వాదం కోరుకుంటున్నానని, బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తానన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం, శిక్షణ, సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేస్తానని, ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతామని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తానన్నారు. భగవంతుడు నాకిచ్చిన శక్తిని విూకోసం వినియోగిస్తానన్న కేటీఆర్‌.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ¬ంశాఖ మంత్రి మహబూబ్‌అలీ, మాజీ మంత్రులు హరీష్‌రావు, తుమ్మల
నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాద్‌, పద్మారావులతో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణలో పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నకు తిలకం దిద్దిన కవిత
అంతకు ముందు ప్రగతి భవన్‌లో కుటుంబ సభ్యుల మధ్య అన్న కేటీఆర్‌కు సోదరి కవిత వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఎంపీ కవిత ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ తల్లి శోభా, ఆయన సతీమణి శైలిమకు కూడా కవిత తిలకం దిద్దారు. కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ప్రగతి భవన్‌ లో పండుగ వాతావరణం నెలకొంది. ఇక ప్రగతి భవన్‌ నుంచి తెలంగాణ భవన్‌ కు బయల్దేరిన కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య ప్రగతి రథంపై కేటీఆర్‌ తెలంగాణ భవన్‌ కు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి.. జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్‌ లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ కు అభినందనలు తెలిపారు.