టీఆర్‌ఎస్ సభలో రసాభాస

టీఆర్‌ఎస్ సభలో రసాభాస
 నల్లగొండ: హూజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశం రసాభాసాగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్  శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ డైరక్టర్ సాముల శివారెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం బూరుగడ్డ గ్రామంలో శివారెడ్డి వర్గీయులు సమావేశం ఏర్పాట చేసి రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. అయితే, ఈ సమావేశానికి ముందుగా మాకు సమాచారం అందించలేదని శంకరమ్మ వర్గీయులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగి సభలో ఉన్న కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. అనంతరం తోపులాట జరిగి సభ ఆసాంతం రసాభాసగా మారింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతపర్చడంతో సమస్య సద్దుమనిగింది.