టీడీపీకి మరోసారి పరాభవం

– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు

న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఎన్నిక జరిగింది. ఎన్‌డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ విజయం సాధించారు. దీనిపై స్పందించిన జీవీఎల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకి ఇది ఘోర పరాజయంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. కాంగ్రెస్‌ చెంతన చేరిన టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని జీవీఎల్‌ అన్నారు. ఏపీని అన్ని విధాల ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆ మేరకు ఇప్పటికే ఒక్కో హావిూని అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. కానీ టీడీపీ నేతలు కేంద్రంపై బురదజల్లి ఏపీ ప్రజల్లో రాజకీయ లబ్ధిపొందేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠంచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పదని జీవీఎల్‌ తెదేపాను హెచ్చరించారు.

————————————–