టీడీపీ పునాదులు కదిపేశక్తి ఎవరికి లేదు

– కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోం
– మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
విశాఖపట్టణం, జూన్‌7(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సమావేశంలో చర్చించుకున్నామని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామని అన్నారు. మండలాల వారిగా సమావేశాలు పెడతామని, పంచాయతీ ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టలో గ్రామస్థాయిలో వారే నిర్ణయం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు అనే మాటలు సొషల్‌ విూడియాలో వింటున్నానని.. కానీ టీడీపీ ప్రజల పార్టీ అని అన్నారు. ప్రజలే అండగా ఉంటారని అయన్న పాత్రుడు అన్నారు. టీడీపీ పునాదులు కదిపే శక్తి ఎవరికి లేదన్నారు. టీడీపీ కార్యకర్తలుపై దాడులు చేస్తే ఉరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కమిటీ వేసి నిర్ణయిస్తామని అంటున్నారని… కమిటీ నివేదిక ఇచ్చాకా స్పందిస్తానన్నారు. జగన్‌ సర్కారు పనితీరుని ఆరు, ఏడు నెలలు గమనిస్తామని, మంచి పనులు చేస్తే సహకరిస్తామని అయ్యన్న పాత్రుడు అన్నారు.