టీవీ వీక్షకులకు ట్రాయ్‌ బొనాంజ

– ఫిబ్రవరి 1నుంచి కొత్త విధానం అమలు

న్యూఢిల్లీ, జనవరి14(జ‌నంసాక్షి) : టీవీ వీక్షకులకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) బంపర్‌ బొనాంజ ప్రకటించింది. కేబుల్‌, డీటీహెచ్‌ ద్వారా టీవీ ప్రసారాలు చూసే వీక్షకులు కేవలం రూ.153 కే వంద టీవీ చానళ్లను అందించాలని ట్రాయ్‌ ఆదేశాలు జారీచేసింది. వీటిలో ఉచిత చానెల్స్‌తోపాటు పే చానల్స్‌ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 1నుంచే వంద చానళ్లను టీవీ వీక్షకులకు అందించాలని ట్రాయ్‌ కోరింది. టీవీ వీక్షకులు జనవరి 31లోగా సంబంధిత సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించాలని ట్రాయ్‌ సూచించింది. ఈ కొత్త విధానానానికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 011-23237922 (ఏకే భరద్వాజ్‌), 011-23220209 (అరవింద్‌ కుమార్‌) లను సంప్రదించవచ్చని లేదా ఈమెయిల్‌ చేయవచ్చని ట్రాయ్‌ తెలిపింది. ఈ బేస్‌ ప్యాకేజీ ద్వారా హెచ్‌డీ చానెళ్లను అందించడం లేదని ట్రాయ్‌ స్పష్టం చేసింది. అయితే కొన్ని విూడియా సంస్థలు మాత్రం హెచ్‌డీ చానెల్స్‌ను కూడా ఈ బేస్‌ ప్యాక్‌ పరిధిలోకి తెస్తున్నట్లు, రెండు నాన్‌ హెచ్‌డీ చానెళ్లకు బదులుగా ఒక హెచ్‌డీ చానెల్‌ను ఇవ్వనున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. దీనికి సంబంధించి సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులపై ఉందని తెలిపింది.