టెక్స్‌టైల్‌ పరిశ్రమతో ఉపాధి అవకాశాలు

ఆశాజనకంగా యువత

వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): టెక్స్‌టై/- పార్క్‌ ఏర్పాటు కానుండడంతో రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా, కేంద్రంగా వరంగల్‌ జిల్లాకు పేరు రానుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరగాలని ఇక్కడి యువత కోరుకుంటుంది. చారిత్రక నగరంగా చెప్పుకునే ఓరుగల్లులో పెద్దగా ఉపాధి కల్పించే ఒక్క కంపెనీ కూడా లేదు. టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో ఈ పరిస్థితి మారనుందని నిరుద్యోగులు అంటున్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఉత్తమ విద్యాసంస్థలకు నిలయమైన ఈ జిల్లాలో ఐటీ, ఫార్మ, రైల్వే, ఎలక్ట్రికల్‌, మొబైల్‌ తదితర కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని యువత కోరుకుంటుంది. అనేకమంది బీటెక్‌, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు చదువుకున్న వారున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ, కేఎంసీ విద్యాసంస్థలున్నాయి. వీరిలో ఇప్పటికీ చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేవు. ప్రస్తుతం కొంతమంది హైదరాబాద్‌లాంటి పెద్ద నగరాలకు వెళ్లి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండగా, మరి కొంతమంది నగరంలోనే ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ వ్యాపార కేంద్రాల్లో చాలీచాలనీ వేతనాలతో పని చేస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పడటంతో పాటు ఇటీవల సిఎం కెసిఆర్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడంతో ఇక్కడి యువతలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికైనా స్థానికంగా మంచి ఉద్యోగా అవకాశాలు లభిస్తాయనే కొంగొత్త ఆశలతో ఎదురు చుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో అతి పెద్ద వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో దీని ద్వారానైన కొంత మంది ప్రత్యక్షంగా, మరి కొంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.యువతకు ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. వరంగల్‌ నగరానికి సవిూపంగా ఉండి, వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. జిల్లాలో ప్రసుత్తం కొన్ని కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులు, రైస్‌ మిల్లులు మినహ ఇస్తే.. ఇక్కడ ఎలాంటి ఉపాధిని ఇచ్చే పరిశ్రమలు లేవు. టెక్స్‌టైల్‌ పరిశ్రమే పెద్ద ఆధారం కానుంది.