ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు..

కేంద్ర కేబినెట్‌ ఆమోదం
– రాష్ట్రపతి ఆమోదముద్ర పొందగానే ఆర్డినెన్స్‌ అమల్లోకి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ట్రిపుల్‌ తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ
ఆర్డినెన్స్‌ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు గట్టెక్కకపోవడంతో.. కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడటం కోసం ఈ ఆర్డినెన్స్‌ ఉపయోగపడనుంది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో ఆమోదం పొందింది. కానీ విపక్షాలు అభ్యంతరాలు లేవనేత్తడంతో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. విపక్షాల ఆందోళనలతో గత ఆగష్టులో ప్రభుత్వం ‘ముస్లిం విమెన్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మ్యారేజ్‌ బిల్లు’లో మూడు సవరణలు చేసింది. ఈ చట్టంలో ట్రిపుల్‌ తలాక్‌ కేసును నాన్‌ బెయిలబుల్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం.. నిందితుడు విచారణకు ముందే బెయిల్‌ కోసం మెజిస్టేట్ర్‌ను అభ్యర్థించవచ్చని సూచించింది. నాన్‌ బెయిలబుల్‌ చట్టం ప్రకారం పోలీస్‌ స్టేషన్లో బెయిల్‌ పొందడం కుదరదు. మరో సవరణ ప్రకారం బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగలరు. మూడో సవరణ ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ కేసులో రాజీకి యత్నించవచ్చు. మెజిస్టేట్ర్‌ తనకున్న అధికారాలతో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చవచ్చు. ఇరు పక్షాలకు కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఉంటుంది.