ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై విూ అభిప్రాయమేంటి: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై టిఆర్‌ఎస్‌, ఎంఐఎం వైఖరి చెప్పాలని కాంగ్రెస్‌ నేత,ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. దీనిపై తమ అభిప్రాయాలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేయడంపై   షబ్బీర్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి బెయిల్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ జైళ్లకు భయపడదని, కాంగ్రెస్‌ పుట్టిందే జైల్లోనని చెప్పారు. పోలీస్‌ వ్యవస్థ టిఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. పోలీసులను వాడుకొని కాంగ్రెస్‌ నేతలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్‌లో చేరితే కేసులెత్తేస్తామంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు. తన ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని, అందుకు ఆధారాలున్నాయని మండిపడ్డారు. ఇది చట్ట విరుద్ధమైన చర్య అని తెలిపారు. ఈ విషయంపై గవర్నర్‌కు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తుల ఫోన్లు చట్ట ప్రకారం ట్యాప్‌ చేయొచ్చన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను ఖైమా చేయడం ఖాయమన్నారు.