డబుల్‌ ఇళ్ల పేరుతో కెసిఆర్‌ మోసం


ఎక్కడా నిర్మాణాలు పూర్తి చేయలేదు
కేంద్రం వాటాను పక్కదారి పట్టించారు
ఎన్ని ఇళ్లు కట్టినా కేంద్రం వాటా ఇప్పిస్తాం
లక్ష్మణ్‌తో కలసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కిషన్‌ రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌5(జ‌నంసాక్షి): డబుల్బెడ్‌రూమ్‌ ఇల్ల నిర్మాణంలో కెసిఆర్‌ ప్రబుత్వం విఫలం చెందిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తికాక పోవటం ప్రభుత్వ చేతకానితనమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదే అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సోమవారం ఉదయం బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్‌తో కలసి ముషీరాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతోన్న డబుల్‌ బెడ్రూం ఇళ్ళను కేంద్రమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డిని కలసిన లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారన్నారు. కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్‌లో 7లక్షల ఇండ్లు పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో దాదాపు 20లక్షల మందికి పేదలకు ఇండ్లు లేవని.. అందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. డబుల్‌ ఇండ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ళను వాడుకుంటోందని…కేంద్ర ప్రభుత్వం ఇళ్ళ కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపించారు.  బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో 431 ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి మూడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓట్లు వేయించుకుందని విమర్శించారు.
మరోవైపు తమకు ఇస్తామన్న డబుల్‌ బెడ్రూం ఇళ్ళు వెంటనే తమకు అప్పజెప్పాలంటూ మహిళలు ఆందోళనకు దిగారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి ముషీరాబాద్‌ నియోజకవర్గం మహిళలు తమ గోడును వెళ్ళబోసు కున్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ళు ఇవ్వకపోతే గ్రేటర్‌ ఎన్నికల్లో ఓట్లు వేసేది లేదని లబ్దిదారులు స్పష్టం చేశారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ళు ఇస్తామంటున్నాడని.. ఐదేళ్ళుగా డబుల్‌ బెడ్రూం ఇళ్ళను ఆశ చూపిస్తున్నారని
మండిపడ్డారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ళ కల నెరవేరకుండానే అనేక మంది లబ్దిదారులు మరణించారని తెలిపారు. కొత్త ఇళ్ళల్లోకి వెళ్తామన్న  నమ్మకం కోల్పోయామన్నారు. ఐదేళ్ళుగా తాము కడుతున్న కిరాయిని ప్రభుత్వమే నష్టపరిహారం కింద చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ ఇళ్ళు తమకు అప్పజెప్పకుంటే దర్నాకు దిగుతామని హెచ్చరించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ళ నిర్మాణంలో నాణ్యత లేదని లబ్దిదారులు విమర్శించారు.