డబుల్‌ ఇళ్ల హావిూపై ప్రజల్లో అసంతృప్తి 

అధికార పార్టీ నేతల్లో ఆందోళన
నల్లగొండ,మే15(జ‌నం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి నాలుగేళ్లవుతున్నా ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఓ వైపు ఇళ్లు, మరోవైపు మంచినీళ్లు తమకు సమస్యగా మారాయని అంటున్నారు. రైతుబంధుతో ప్రజల్లో ఇప్పుడిప్పుడే సానుకూల ధోరణి వస్తోంది.  ఎన్నికలు  వస్తున్న తరుణంలో ప్రజల వద్దకు ఎలా వెల్లాలన్న ఆందోళన మొదలయ్యింది. ఆయా నియోజకవర్గాల్లో ఈ మేరకు నేతలను నిలదీస్తున్నారు. జనాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఇటీవల కొందరు నాయకులు జిల్లాస్థాయి అధికారిక సమావేశంలో ఆందోళన వెలిబుచ్చారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలందరికీ రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని హావిూ ఇచ్చినా.. ఇంతవరకు వాటిని అక్కడక్కడా నిర్మించినా పెద్దగా ప్రగతి లేదు.  గత ప్రభుత్వాల హయంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు నేటికి చెల్లించలేదని కనీసం అవి చెల్లించినా కొంత అసంతృప్తి ఉండేది కాదంటున్నారు.  అప్పులు చేసి నిర్మించుకున్న పేదలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అభివృద్ధి జరిగిన
చోటే నిర్మిస్తామని చెబుతున్న రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో.. అడవిలో జీవిస్తున్న ఎస్టీలకు ఏవిధంగా న్యాయం చేస్తారో వివరించాలని  నిలదీశారు. మొదటి విడతలో ఒక్కో నియోజవర్గానికి 400 ఇళ్లను కేటాయించినా ఒక్కటీ పూర్తి చేయలేదని వాపోయారు. లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తామని చెబుతున్నా ఎంతవరకు అమలన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఇకపోతే ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీనిపై కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని పలువురు ఎంపిపిలు వాపోయారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్తు సంస్థ అధికారుల సమన్వయ లోపంతో చాలా గ్రామాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎంపీపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో సమన్వంయంతో పోవాలని  పరిష్కారం చెప్పాలని.. తప్పించుకోవాలని చూడొద్దని.. వెంటనే పెండింగ్‌లోని పనులకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సూచించారు. మొత్తంగా ఈ రెండు సమస్యలపై ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొటున్నామని వాపోతున్నారు.
———-