డిపోల వద్ద ఉద్రిక్తత!

– విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు కార్మికులు
– అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట
– తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొనేందుకు యత్నం
– నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
– గుండెపోటు రావటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన రాజేందర్‌
– ఖమ్మంలో బిల్డింగ్‌ ఎక్కి నిరసన వ్యక్తంచేసిన మహిళా కార్మికులు
హైదరాబాద్‌, నవంబర్‌26 ( జనం సాక్షి ) : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉధ్రిక్తత చోటుచేసుకుంది. కార్మికులు విధుల్లోకి వెళ్లేందుకు తెల్లవారు జామునే డిపోల వద్దకు చేరుకున్నారు. దీంతో అప్పటికే పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోని దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందున విధుల్లో చేరడం కుదరంటూ కార్మికులను వెనక్కి పంపివేశారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రే పలువురు  జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక కండక్టర్లను, డ్రైవర్లను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్ట్‌ చేశారు. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగాయి. కరీంనగర్‌ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఐ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో చేరుందుకు వచ్చిన సంగారెడ్డి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి డిపోలోకి ఆర్టీసీ కార్మికులు దూసుకువచ్చారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అధికారులలో వాగ్వివాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 మంది కార్మికులతో పాటు మహిళా కండక్టర?లను అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ -1 డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన ఏడుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. కేసీఆర్‌కు దండం పెడుతున్నాము..దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ ఇళ్లల్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విధుల్లోకి చేరడానికి ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి డిపోలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. కార్మికులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని మహిళా కండక్టర్లు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా  డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. విధుల్లోకి చేరేందుకు కార్మికులు అన్ని డిపోలకు వెళ్లారు. డిపో లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. 23మంది కార్మికులను అరెస్ట్‌ చేశారు. నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నారాయణ పేట డిపోవద్ద ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపోకి చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్నారు.
దీంతో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపో వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నార్కట్‌పల్లి, దేవరకొండ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట, కోదాడ ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌ చేశారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో వద్ద విధుల్లోకి చేరేందుకు యత్నించిన కార్మికును పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్దిపేట డిపో వద్ద పోలీసులకు, కార్మికుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో వద్దకు పోలీసులకు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. విధులకు హాజరవుతామంటూ కార్మికులు డిపోలోకి చొచ్చుకొచ్చారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ అధికారులు వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకొని కార్మికులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కార్మికులు డిపోల వద్దకు చేరుకొని తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. పలువురు ఆర్టీసీ మహిళలు బిల్డింగ్‌ ఎక్కి తమను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే బిల్డింగ్‌ ఎక్కి దూకుతామని బెదిరించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి కిందకు దింపారు.
గుండెపోటుతో రాజేందర్‌ మృతి..
తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేందర్‌ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మెవిరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్‌ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్‌ది నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పాడ్‌ గ్రామం.—-