డిప్యూటీ స్పీకర్‌ పదవి..  ఏకగ్రీవానికి సహరించండి


– భట్టి, ఉత్తమ్‌తో భేటీ అయిన కేటీఆర్‌
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలి
– కేటీఆర్‌కు సూచించిన ఇరువురు నేతలు
– కేసీఆర్‌తో చర్చించి చెబుతానన్న కేటీఆర్‌
– డిప్యూటీ స్పీకర్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన పద్మారావు
– ఏకగ్రీవం కానున్న ఎన్నిక
హైదరాబాద్‌, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావును తెరాస ప్రతిపాదించింది. ఆయన ఎంపిక సోమవారం లాంఛనం కానుంది.. కాగా ఏకగ్రీవంగా ఎంపికను ఏకగ్రీవం చేసేందుకు తెరాస ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా శనివారం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఎంపిక లాంఛణమే అయినా ఈ పదవిని ఏకగ్రీమయ్యేలా చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్‌, మజ్లిస్‌, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా సూతప్రాయంగా అంగీకారం తెలిపినా తుదినిర్ణయం మాత్రం తెలపలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో తమకు సహకరించాలంటూ కేటీఆర్‌ శనివారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో చర్చించిన అనంతరం తమ నిర్ణయం చెబుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ఇదే సమయంలో ఉత్తమ్‌ కుమార్‌సైతం వీరితో సమావేశమయ్యారు. దీంతో డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌ని కేటీఆర్‌ కోరారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో వీరిద్దరి భేటీ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తన ఫోన్‌నెంబర్‌ను ఎందుకు బ్లాక్‌ చేశారని ఉత్తమ్‌.. కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్‌ బదులిస్తూ.. విూ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా?.. నేను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తాను అని అన్నారు. ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవానికి కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతూనే.. ఓ షరతును పెట్టినట్లు తెలుస్తుంది. ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇస్తామని, దానికి బదులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం తమ తుది నిర్ణయాన్ని తెలుపుతానని పేర్కొనట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలకు పోటీ చేయడంపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకూ సంఖ్యా బలం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు. సంఖ్యా బలం లేకున్నా ఐదుగురిని నిలబెడుతామని సీఎం కేసీఆర్‌ ఎలా చెబుతారని భట్టి ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలలో కేసీఆర్‌ ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలిన కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు మంత్రులు
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి హాజరయ్యారు.
పద్మారావు నామినేషన్‌ దాఖలు..
తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, మంత్రులు శ్రీకాంత్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, విపక్ష నేతలు శ్రీధర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే పద్మారావు ఎంపికకు బీజేపీ, ఎంఐఎంలు తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలపడంతో శ్రీధర్బాబు ఎన్నిక ఏకగ్రీవం కానుంది.