డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ అండ

చంద్రన్న పసుపు-కుంకుమ, వడ్డీ రాయితీలపై అవగాహన సదస్సు
పెన్షన్ల కోసం 600 కోట్లు ఖర్చు : మంత్రి ప్రత్తిపాటి
గుంటూరు,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): చిలకలూరిపేట గ్రామ సంఘం లీడర్ల ఆధ్వర్యంలో ఎస్‌ఎంఎస్‌ గార్డెన్స్‌లో బుధవారం వెలుగు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. చంద్రన్న పసుపు-కుంకుమ, వడ్డీ రాయితీలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ కింద రూ 37.62 కోట్లు అందజేశారు. అనంతరం మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ. 2514 కోట్లు వడ్డీరాయితీ కింద ఇచ్చామని, మూడు విడతల్లో ఒక్కొక్క మహిళకు రూ. 8 వేలు చొప్పున రూ.6833 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. 86 లక్షల మందికి చంద్రన్న పసుపు కుంకుమ కింద రూ.8600 కోట్లు మంజూరు చేశామన్నారు. మిగిలిన రెండు వేలు దసరా కానుకగా అందజేయనున్నామని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల పింఛన్లకు రూ.600 కోట్లపైన ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 14 రకాల పింఛన్లు అందిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.   అనారోగ్యరీత్యా మెరుగైన వైద్యం పొందేందుకు ముందస్తు పైకంగా ఎల్‌ఓసీ దోహదపడుతుందన్నారు. ఆరోగ్య శ్రీ వర్తించని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చేయూత నందిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.