ఢిల్లీని వెన్నాడుతున్న కాలుష్యం
న్యూఢిల్లీ,నవంబర్6(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయి గాలిలో నాణ్యత లోపించింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) సంస్థ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 470 గా నమోదైనట్లు తెలిపింది.
ఢిల్లీ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 8.10 గంటలకు 449 ఏక్యూఐ నమోదు కాగా, చాందినీ చౌక్లో 437 ఏక్యూఐ నమోదైంది. అలాగే ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ 3 వద్ద 396 ఏక్యూఐ, ఢిల్లీ యూనివర్సిటీ ఏరియా వద్ద 470 ఏక్యూఐ నమోదైంది. ఈ క్రమంలో నగర పౌరులను ఇండ్ల నుంచి బయటికి రావద్దని సఫర్ హెచ్చరిస్తున్నది. అయితే మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు గాలి నాణ్యత కొంచెం మెరుగు పడుతుందని, ఆ సమయంలో బయటికి రావచ్చని సఫర్ తెలిపింది.