ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు!

118 ఏళ్ల తర్వాత పడిపోయిన టెంపరేచర్‌
న్యూఢిల్లీ,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. అలాగే ఉత్తరాది కూడా వణుకుతోంది. చలి మంటలు కూడా చలిని అడ్డుకోలేకపోతున్నాయి. ఎముకలు కొరికే చలికి ఢిల్లీ వాసులు వణుకుతున్నారు. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. 118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 1901లో తొలిసారిగా డిసెంబర్‌లో నెలలో ఉష్ణోగ్రతలు పడిపోగా.. మళ్లీ ఇప్పుడు నాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ అతి శీతల రెండో డిసెంబర్‌ నెలగా నిలిచిపోనుంది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. 1919, 1929, 1961, 1997 సంవత్సరాల్లో మాత్రమే డిసెంబర్‌ నెలలో ఢిల్లీలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నెలలో 26వ తేదీ నాటికి సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. 19.85 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. డిసెంబర్‌ 31వ తేదీ నాటికి 19.15 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒక వేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతే.. ఢిల్లీ చరిత్రలో 1901 తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన రెండో డిసెంబర్‌ నెలగా 2019, డిసెంబర్‌ నెల నిలిచిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీ నుంచి వరుసగా 13 రోజులు ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అయ్యాయి. 1997, డిసెంబర్‌ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి.