ఢిల్లీలో చంద్రబాబును..  ఫెవికల్‌ బాబా అని పిలుస్తున్నారు

– తెదేపాకు ఏపీలోనే గెలిచే పరిస్థితి లేదు..
– చంద్రబాబు ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు
– బాబు తీరుతో దేశవ్యాప్తంగా ప్రజలు నవ్వుకుంటున్నారు
– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీలో గెలిచే పరిస్థితి లేదని, కానీ దేశంలో కూటమిని ఏర్పాటు చేస్తానంటూ ఢిల్లీ, లక్నోలు తిరగడం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలపై సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుస సమావేశాలతో విపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో గెలిచే సీన్‌ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడన్నారు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టింది చంద్రబాబు అని, ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డాడంటూ మండిపడ్డారు. యూపీఏ, మాయావతి-అఖిలేశ్‌ ఫ్రంటులు చతికల పడ్డాయని, చంద్రబాబు గ్రాఫ్‌ ఢమాల్‌ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైందన్నారు. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నాడని, పాపం అటు ఇటు కాకుండా చంద్రబాబు మారిపోయాడని విజయసాయి అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్‌ బాబా’ అని పిలుస్తున్నారని, పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకంచేస్తా అంటుంటే ఈ నిక్‌ నేమ్‌ తగిలించారట అని విజయసాయి ఎద్దేవా చేశారు. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్‌ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట అంటూ అని విజయసాయి విమర్శించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు
చేస్తున్నదేమిటో అని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా గాంధీ, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడని విమర్శించారు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసని, లగడపాటి ఎగ్జిట్‌ పోల్‌ సర్వేను నమ్మి ఎగ్జయిట్‌ అయిన తెలుగు తమ్ముళ్లు 23తర్వాత తేడా వస్తే ఆయన్ను నిలదీసేట్టున్నారన్నారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయినోళ్లు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. మాజీ ఎంపీవి కాబట్టి పోలీసు ప్రొటెక్షన్‌ అడగొచ్చు తప్పులేదని ఎద్దేవా చేశారు.
——————————————-