ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాత్రి 9.00 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయల్దేరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కుమారుడి వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. అలాగే ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు. ముందుగా ఎస్సీల వర్గీకరణ అంశంపై అఖిలపక్ష నేతలతో ఢిల్లీ వెళ్లాలనుకున్న సీఎం పర్యటన ఆకస్మికంగా రద్దయింది. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో పర్యటన రద్దయినప్పటికీ.. ముందుగా నిర్ణయించుకున్న ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు.