తదుపరి చైర్మన్‌గా వడ్త్య దేవేందర్‌ నాయక్‌?

నల్గొండ,జూన్‌26(జ‌నం సాక్షి): దేవరకొండ మున్సిపల్‌ తదుపరి చైర్మన్‌గా గతం నుంచి పోటీపడుతున్న వడ్త్య దేవేందర్‌నాయక్‌ అవకాశాలు మెరుగు పడ్డాయి. ఆయనే తదుపరి ఛైర్మన్‌ జాబితాలో ఉన్నట్లు పట్టణంలో చర్చ కొనసాగుతుంది. టిఆర్‌ఎస్‌ వర్గాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ఇప్పటికే కౌన్సిలర్లు సమావేశమై దేవేందర్‌ను చైర్మన్‌గా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 20వార్డులు ఉండగా ఇద్దరు బీజేపీ, ఒకరు ఇండిపెండెంట్‌, ఒక టీడీపీ, ఒక కాంగ్రెస్‌ కాగా 15మంది వివిధ పార్టీల నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి చేరినవారే. చైర్మన్‌ పదవికి పోటీలో ఉన్న వడ్త్య దేవేందర్‌నాయక్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అనుచరుడు. చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన మంజ్యానాయక్‌ సైతం ఎమ్మెల్యే అనుచరుడే కావడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం పెట్టి తనను పదవి నుంచి దింపుతారని భావించిన దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ మంజ్యానాయక్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌రావుకు రాజీనామా లేఖ అందించారు. అనారోగ్యంతో పాటు వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు కమిషనర్‌ తెలిపారు. రాజీనామా లేఖను కలెక్టర్‌, మున్సిపల్‌ ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు