తహాశీల్దార్‌ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

మధిర, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : మధిర పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం నందు తహశీల్దార్‌ ఎల్‌.పూల్‌సింగ్‌చౌహాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబురాలను  ఘనంగా నిర్వహించారు. ఐకెపి, మెప్మా సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లు  పెద్ద పెద్ద బతుకమ్మలను తయారు చేసి తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అందంగా బతుకమ్మలను ఏర్పాటు చేసి బతుకమ్మ పూజలు చేసి బతుకమ్మలాటలు ఆడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ చౌహాన్‌ పాల్గొని బతుకమ్మలకు పూజలు నిర్వహించి బతుకమ్మలాటలు ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ  సంబరాలను ప్రభుత్వం ఆదేశాలమేరకు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దసరా పండుగను, బతుకమ్మ సంబరాలను ప్రజలందరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్‌ ఉపేందర్‌, వీఆర్వోల సంఘం అధ్యక్షులు సైదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.