తీనమార్‌ మల్లన్నపై మరో కేసు  నమోదు

నిజామాబాద్‌,అక్టోబర్‌11  (జనం సాక్షి)

జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్‌ స్టేషన్‌ లో చింతపండు నవీన్‌ కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న, ఉప్పు సంతోష్‌ పై కేసు నమోదు చేసినట్లు 4వ టౌన్‌ ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మాచారెడ్డికి చెందిన బాల్‌ రాజ్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. కాగా, ఇసుక వ్యాపారంలో అవకతవకలకు పాల్పడుతున్నావని 2018లో నిజామాబాద్‌ నగరంలోని ప్రశాంతి హోమ్స్‌కు పిలిపించి బాల్‌రాజ్‌ గౌడ్‌ను చంపుతామని నిజామాబాద్‌ కు చెందిన ఉప్పు సంతోష్‌ బెదిరించాడు. రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఛానల్‌ పెడుతున్నామని పార్టీ ఫండ్‌ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని తీన్మార్‌ మల్లన్న, ఉప్పు సంతోష్‌ డిమాండ్‌ చేసారని, ఈ విషయంపై 4 టౌన్‌ లో ఫిర్యాదు ఇవ్వడనీతో కేసు నమోదు చేసి ఉప్పు సంతోష్‌ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు పంపామన్నారు. తీన్మార్‌ మల్లన్న జైలులో ఉండడంతో పిటి వారెంట్‌ రెండు రోజుల్లో దాఖలు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో సంతోష్‌ ను ఏ 1 గా, మల్లన్నను ఏ 2 గా చేర్చామని పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై 386, 420, 506, 120 బి సెక్షన్ల లో కేసు నమోదు చేశారు పోలీసులు.