తెరాస వైఫల్యాలను ఎండగడతాం

హావిూలపై నోరుమెదపని నేతలు

నిజామాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ ఏర్పడ్డ తరవాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల పాలనలో తెరాస పూర్తిగా వైఫల్యం చెందిందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కారని అన్నారు. అవినీతి, అహంకారానికి తెరాస ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండానే గోబెల్స్‌ ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్‌ ప్రజలను చైతన్యం చేస్తోందని తెలిపారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కడగళ్లు చూస్తే నిజాలు తెలుస్తాయని చెప్పారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కేసీఆర్‌ పాలన నియంతృత్వం ట్రేడ్‌మార్క్‌లా మారిందని ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు విూ పాలనలో కాదా ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని మండిపడ్డారు. బీజేపీ తమవి గొప్ప సిద్ధాంతాలంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్‌ నేతలను ప్రలోభపెడుతుందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరడం లేదని… కాంగ్రెస్‌ పార్టీలో చేరతామంటూ బీజేపీ సీనియర్లే తమను సంప్రదిస్తున్నారని అన్నారు.