తెలంగాణలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్రం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు.

లాక్‌డౌన్‌పై ఉత్తర్వులు

రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల జూన్‌ 7 వరకు యథాతథ పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించారు. దవాఖానలు, మెడికల్‌ షాపులు మినహా ఇదర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెలరచి ఉంచవచ్చని వెల్లడించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేస్తున్నామని ప్రకటించారు.