తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు

మరోమారు గెలిపిస్తే అభివృద్ది ముందుకు: ఈశ్వర్‌

జగిత్యాల,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాత కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పలువురు నాయకులు ఆయనను కలసి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాతగా నిలిచిన కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చారని, ఎన్నో సంక్షేమ, అభివృద్థి పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని యావత్‌ తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్యాయానికి గురైందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణకు కేసీఆర్‌ శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారని, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తున్నారని అన్నారు. మిషన్‌ కాకతీయతో, ఉనికినే కోల్పోయిన అనేక వేల చెరువులు, కుంటలు తిరిగి జీవం పోసుకున్నాయని, అవి నేడు జలసిరితో తొణికిసలాడుతున్నాయని అన్నారు. రైతులు సాగు నీరంది ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే మిషన్‌ భగీరథతో ఇంటింటికి గోదావరి జలాలు అందుతాయన్నారు. నుంచి మంచినీరు అంది, తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలు, కులాలు, వర్గాలు, మతాలతో సంబంధం లేకుండా అందరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, అది కేవలం కేసీఆర్‌ వల్ల మాత్రమే సాధ్యమవుతోందని వివరించారు. ఎన్నాళ్ల సందో ఆదివాసీలు, గిరిజనులు కోరుతున్న పంచాయతీల విభజన కోరికను తీర్చిన కీర్తి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన తెలిపారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే నియోజకవర్గంతో పాటు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం కలగనుందని ఆయన పేర్కొన్నారు.