తెలంగాణ‌, ఆంధ్రా రాష్టాల్లో..  ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు


– చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు
– క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ, తెలంగాణ సీఎంలు
హైదరాబాద్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : క్రిస్మస్‌ వేడుకలతో రెండు రాష్ట్రాల్లో మంగళవారం కోలాహలం నెలకొంది.. తెలంగాణ‌, ఆంధ్రా రాష్ట్రాల్లోని చర్చిల వద్ద కైస్త్రవులు ప్రత్యేక పార్థనల్లో మునిగిపోయారు. తెలంగాణ‌, ఆంధ్రా రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైస్త్రవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్‌ దీపాలతో వెలిగిపోతున్నాయి. మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. బిషప్‌ సాల్మన్‌ రాజ్‌ ఆధ్వర్యంలో తెల్లవారుజామున శిలువ ఊరేగింపు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో వైసీపీ సమన్వయకర్త జోగి రమేశ్‌ పాల్గొన్నారు. కైస్త్రవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎస్‌ఐ, ఆర్‌సీఎం చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గన్నవరం, నిడమానూరులోని పలు చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో వైసీపీ సమన్వయ కర్త యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విశాఖపట్నం పెదబయలు మండలంలో జరిగిన ఐక్య క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేటలోని పలు చర్చిలలో క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైసీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో కేక్‌ కట్‌ చేసి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. విశాఖపట్నం అరకు మండలం పనిరంగిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో వైసీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూపాంతర దేవాలయం చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, గ్రంధి శ్రీనివాస్‌, కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సీఎస్‌ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్‌ రావు హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసి కైస్త్రవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో విదేశీ భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధి వద్ద విదేశీ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. సూర్యాపేటలోని మేరిమాత చర్చిలో జరుగుతున్న క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. యాద్రాద్రి జిల్లాలోని చర్ల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు వైభవంగా జరిగాయి. ఖమ్మంలోని సెయింట్‌ మేరీస్‌ చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. కైస్త్రవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో క్రిస్మస్‌ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిల్లో కైస్త్రవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింరారు. నగరంలోని చర్చిలు సర్వాంగ సుందరంగా అలకరించారు. గుణదల మేరిమాత చర్చిలో క్రీస్తు ఆరాధన కొనసాగుతుంది. కాకినాడ పట్టణంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా విశాఖపట్నం అల్లిపురం కల్వారి బాప్టిస్ట్‌, పాతనగరం లండన్‌ మిషన్‌ మెమోరియల్‌ చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలను కైస్త్రవ సోదరులు ఘంగా జరుపుకున్నారు.