తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక

జ‌నంసాక్షి: తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్.. పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్‌ గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ చైర్‌లో కూర్చోవాలని కోరారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ చైర్ వద్దకు సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లి చైర్‌లో కూర్చోబెట్టారు. దీంతో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన  సభా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముందుగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పోచారం రాజకీయ ప్రస్థానం వివరించారు. తర్వాత ఈటెల రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు, తదితరులు మాట్లాడారు.