తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి

అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు యువత స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని పదవ బెటాలియంలో అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో 1940 కాలంలో దొరల ఆగడాలకు అడ్డూ అదుపు అనేది లేకుండా సాగే ఆరోజుల్లో దొరలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టి దొరల ఆధిపత్య వాదంపై ఆయుధాన్ని ఎత్తిపట్టి శివంగిల అన్యాయాన్ని నిలదీసి భూస్వాములపై గర్జిస్తూ దొరతనాన్ని ఎదిరిస్తూ వివక్షపై విరోచితంగా పోరాడిన గొప్ప యోధురాలు అని కొనియాడారు. ఐలమ్మ తెలంగాణ మహిళలోకంలో ఎంతో ఉద్యమ స్ఫూర్తిని నింపారని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రాజేష్, రాజారావు, శ్రీధర్ మరియు బెటాలియన్ అధికారులు ఇబ్బంది పాల్గొన్నారు. అలాగే బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవ రావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని కొండేరు గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కావడానికి చాకలి ఐలమ్మ విరోచితంగా పోరాడారనీ అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంను జరుపుతూ కనీసం చాకలి ఐలమ్మ సేవలను స్మరించకోకుండ అవమానపరిచారని విమర్శించారు. అదేవిధంగా ఇటీవల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి ప్రకాష్ రెడ్డి చాకలి ఐలమ్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచారని మండిపడ్డారు. కనీసం రవి ప్రకాష్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చాకలి ఐలమ్మ పై టిఆర్ఎస్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచన విధానం ఒకే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.జి కృష్ణ, మండల కన్వీనర్ పేరపోగు తిరుపాల్, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.